flying birds photo: flying birds 8zmk5t.gif మంచులా,ముత్యంలా,మల్లెపువ్వులా స్వచ్ఛమైన మనసుండాలనేదే హేమంతం....

Sunday, July 5, 2015

✿✿గోదావరి పుష్కరాలు ✿✿

. భారతదేశంలో గంగానది తర్వాత అంత పేరుగాంచిన జీవనది గోదావరినది. గోదావరిని దక్షిణ గంగానదిగా అభివర్ణిస్తారు.అంతటి ప్రాముఖ్యం గల ఈ పుణ్యనదియొక్క రాశి సింహ రాశి.
 ఈ సంవత్సరం గోదావరి పుష్కరాలు{మన్మధనామసంవత్సర అధిక ఆషాఢ బహుళ త్రయోదశి మంగళవారం }అనగా జులై 14-2015 ఉదయం గం.6.30ని.బృహస్పతి సింహరాశి  లోకి ప్రవేశిస్తుంది కావున గోదావరినదికి పుష్కరాలు ప్రారంభం అవుతాయి.
   పుష్కరము అంటే పన్నెండు సంవత్సరాలు.
భారత కాలమానం ప్రకారం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోని ముఖ్యమైన నదులన్నిటికి 'పుష్కరాలు ' వస్తాయి.పుష్కర సమయంలో ఆయానదులలో స్నానం చేస్తే ప్రత్యేక పుణ్యఫలం లభిస్తుందని హిందువుల నమ్మకం.బృహస్పతి ఆయారాశులలో ప్రవేశించినపుడు ఆయా నదులకు పుష్కరాలు  వస్తాయి.బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలం  ఆ నది పుష్కరంలో ఉన్నట్టే.పుష్కరకాలం సాధారణంగా ఒక సంవత్సరం పాటు ఉంటుంది.పుష్కర కాలంలోని మొదటి పన్నెండురోజులు ఆది పుష్కరాలని,చివరి పన్నెండు రోజులని అంత్య పుష్కరాలని వ్యవహరిస్తారు.ఈ మొదటి మరియు చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.
                                            పుష్కర జననం
పవిత్రమైన నదులలో మానవులు స్నానంచేసి వారి పాపాలను పోగొట్టుకుంటారు.నదులు ఆ పాపాలు స్వీకరించి అపవిత్రం అవుతున్నాయి.మానవులవల్ల అపవిత్రం అయిన ఆ నదులు పాపాలు భరించలేక బాధ పడుతుంటే పుష్కరుడు అనే మహానుభావుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి బ్రహ్మదేవుని అనుగ్రహం పొంది తనను ఒక పవిత్ర క్షేత్రంగా  మార్చమని కోరతాడు  ఈ విధంగా పుష్కరుడు పుష్కరతీర్ధంగా మారి స్వర్గలోకమున మందాకిని నదియందు అంతర్భూతమై ఉన్నాడు.
                                             పుష్కరుని చరిత్ర
పూర్వం తుందిలుడనే ధర్మాత్ముడు ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నడు.ఈశ్వరుడు తుందిలుని ఏ వరం కావాలో కోరుకోమన్నడు  తుందిలుడు తనకు శాశ్వితంగా ఈశ్వరునిలో స్థానం కావలన్నాడు.ఈశ్వరుడు తన అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో శాశ్వత స్థానం ఇచ్చాడు. అందువలన అతడు మూడున్నరకోట్ల పుణ్యతీర్ధాలకు అధిపతి అయ్యాడు. ఇలా సకల జీవరాశిని పోషించగలిగే శక్తి అతనికి లభించింది.పొషించేశక్తిని సంస్కృతంలో పుష్కరం అంటారు. అలా తందిలుడు పుష్కరుడయ్యడు.బ్రహ్మదేవునికి సృష్టి చేయవలసిన అవసరం  ఏర్పడినప్పుడు జలంతో అవసరమేర్పడి జలంకోసం ఈశ్వరుని గురించి తపస్సు చేశి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకొని జలసామ్రజ్యానికి చక్రవర్తి ఐన పుష్కరుని తనకివ్వమని కోరుకున్నడు ఈశ్వరుడు అందుకు అంగీకారం తెలుపగానే పుష్కరుడు బ్రహ్మదేవుని కమండలంలోనికి ప్రవేశించాడు.బ్రహ్మకార్యం పూర్తి అయిన తరువాత ప్రాణులను బ్రతికించే ధర్మం  నెరవేర్చడానికి బృహస్పతి ప్రాణులకు జీవాధారమైన జలం కావాలని బ్రహ్మదేవుని ప్రార్ధించాడు.ఆ కోరికను బ్రహ్మదేవుడు మన్నించాడు కానీ పుష్కరుడు తాను బ్రహ్మను వదిలి వెళ్ళలేనని చెప్పాడు.అప్పుడు బృహస్పతి,బ్రహ్మ,పుష్కరుడు కలసి  ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం గ్రహరూపంలో ఉన్న బృహస్పతి మేషాది ద్వాదశ రాశులలొ ప్రవేశించినప్పుడు,ప్రవేశించిన రోజునుండి పన్నెండు రోజులు  మిగిలినకాలం సంవత్సరమంతా మధ్యాహ్న సమయంలో రెండు ముహుర్తాల సమయం పుష్కరుడు బృహస్పతితో ఉండాలని నిర్ణయించారు.ఆ సమయంలో సమస్తదేవతలు బృహస్పతి అధిపతిగా ఉన్ననదికి పుష్కరునితో వస్తారుకనుక పుష్కరకాలంలో నదీస్నానం పుణ్యప్రదమని పురాణాలు చెప్తున్నాయి.