flying birds photo: flying birds 8zmk5t.gif మంచులా,ముత్యంలా,మల్లెపువ్వులా స్వచ్ఛమైన మనసుండాలనేదే హేమంతం....

Thursday, October 29, 2015

అట్లతద్ది

పూర్వం ఒకప్పుడు ఒక రాజు కూతురు, మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఆరోజు అట్లతద్ది. రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటున్నారు. పెద్దలంతా రాత్రికి దేవీ పూజ నైవేద్యం కోసం అట్లు వేయడంలో నిమగ్నులయ్యారు. ఇంతలో రాజుగారి కూతురు ఆకలితో సొమ్మసిల్లి పడింది. రాజకుమారుడు తన చెల్లి అవస్థ చూసి ఇంద్రజాలం చేశాడు.
ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి 'అదిగో చంద్రోదయమైంది. అమ్మా!కొంచెం పండ్లు తిని సేదతీరి పూజ చేసుకో' అన్నాడు.

రాజకుమార్తె అన్నగారి మాట విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంది. అయితే ఈ పూజ నియమం ఏమిటంటే చంద్రోదయం చూసి అప్పుడు షోడశోపచారాలతో ఉమాదేవిని పూజించాలి. అందుకే ఈ వ్రతానికి 'చంద్రోదయ ఉమావ్రతం' అని పేరు వచ్చింది. ఆరోజు స్త్రీలు, దేవిని ఆరాధించి తొమ్మిది అట్లు నైవేద్యంగా పెట్టి, తొమ్మిది అట్లు వాయనం ఇచ్చి, తొమ్మిది పువ్వుల ముడితో తోరం కట్టుకుంటారు. ఇలా చేస్తే మంచి భర్త లభిస్తాడని నమ్మకం. రాజకుమార్తె తన స్నేహితురాళ్ళతో అన్నీ యథావిథిగానే చేసింది. కానీ అన్న చెప్పిన మాట నమ్మి చంద్రోదయానికి ముందే భోజనం చేసింది.

ఆ రోజుల్లో ఆడపిల్లలకి బాల్యదశలోనే పెళ్లి చేసేవారు. ఆమెకు ముసలివాడు భర్తగా లభించాడు. “అయ్యో అట్లతద్ది నోము చేస్తే అందమైన భర్త లభిస్తాడన్నారు కదా! నా స్నేహితురాళ్ళకందరికీ మంచి యౌవనవంతులైన భర్తలు లభించారు. నేనేమి అపచారం చేశాను?” అంటూ దుఃఖించి పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించగా వారు ప్రత్యక్షమై" నీ అన్న అజ్ఞానం, నీ పై అతనికుండే ప్రేమవల్లనే వ్రతభంగం జరిగింది. రేపు ఆశ్వయుజ బహుళ తదియ, నీవు నియమనిష్టలతో చంద్రోదయ ఉమావ్రతం చేస్తే నీ భర్త యౌవనవంతుడవుతాడు" అన్నారు. ఆమె ఆ నోము చేసి కథ చెప్పి అక్షింతలు తీసుకుని భర్తమీద వేసేసరికి అతడు యౌవనవంతుడయ్యాడు .
 కన్నెపిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సకల సౌభాగ్యాలను పొందుతారు.
ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ తదియనాడు స్త్రీలంతా ఆనందోత్సాహాల్తో అట్లతద్ది జరుపుకుంటారు. అట్లతద్దికి ముందురోజును భోగి అంటారు. భోగినాడు స్త్రీలంతా చేతులకు, పాదాలకు, గోరింటాకు పెట్టుకుని ఎవరి చేయి బాగా పండిందని ఉత్సాహంగా చూసుకుంటారు. ఎవరి చేయి ఎర్రగా పండితే వారికి అదృష్టం బాగుంటుందని వారి విశ్వాసం. పండుగ వస్తే, అట్లు వండి అమ్మవారికి నివేదన చేస్తారు.దాని కోసం ముందు రోజే పిండి కొట్టుకోవడం, మినప్పప్పు రుబ్బి అట్లు తయారుచేయటం ఒక పెద్ద కార్యక్రమం. అట్లతద్దినాటి అట్లు తినడానికి ఉవ్విళ్ళూరుతారు. మగవాళ్ళు ఈ పండుగ కోసం ఎదురుచూస్తూ ఇంట్లో ఊయల కడతారు. పెరట్లో చెట్లకి కూడా ఉయ్యాల వేస్తారు. ఈ ఉత్సవంలో పిల్లలంతా ఆసక్తిగా పాల్గొంటారు.

 అట్లతద్దినాడు తెల్లవారుఝామున లేస్తారు.అన్నం, గోంగూర పచ్చడి, పెరుగుతో కడుపునిండా తింటారు. 'అట్లతద్దోయ్, ఆరట్లోయ్ ముద్దపప్పు మూడట్లోయ్' అంటూ అరుస్తూ ఇరుగు పొగురు స్నేహితులందరితో కలిసి ఆటలు ఆడతారు. ఇందులో పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. ధైర్యంగా వీధుల్లోకి వచ్చి ఆడుకోవడానికి ఇదే అదును కాబట్టి పిల్లలతో బాటు తల్లులు కూడా బాల్య జీవితాల్లోకి వెళ్లి ఆనందం పొందుతారు.

Friday, October 9, 2015

జ్ఞానోదయం

ఒక అడవిలో ఒక తల్లి ఎలుక ఉంది. దానికో పిల్ల ఎలుక. ప్రపంచంలో అందరి కంటే శక్తిమంతుడైన వాడిని వెతికి తెచ్చి పెళ్లి చేయాలని తల్లి ఎలుకకొక బుల్లి కోరిక. అలాంటి పెళ్లి కొడుకు ఎక్కడ దొరుకుతాడా అని పుట్టలు, గుట్టలు ఎక్కి వెతికింది. ఆకాశంలోకి చూసింది. తన తేజస్సుతో లోకమంతా కాంతులు నింపుతున్న సూర్యుడు కనిపించాడు. "నాయనా సూర్యుడా! సృష్టిలో అందరికంటే శక్తిశాలివి నువ్వు. మా అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేస్తాను" అంది. "అసలు సృష్టిలో నేను అందరికంటే శక్తిశాలిని అనే నీ అభిప్రాయమే తప్పు. దట్టమైన మేఘం కమ్మితే, శక్తి మాట దేవుడెరుగు, నేను కనపడకుండా పోతాను" అన్నాడు సూర్యుడు.

టక్కున మేఘం దగ్గరికి పరుగెత్తింది తల్లి ఎలుక. "నాదేమి శక్తి, వానాకాలం శక్తి. గట్టిగా గాలి కొడితే నిలవలేక ఎగిరిపోయేవాడిని" అంది మేఘం. నిజమే కదా అనుకుంటూ గాలి దగ్గరికి పరిగెత్తింది ఎలుక. గాలి నీరసంగా, దిగులుగా నవ్వుతూ, "నాదొక శక్తా? అదిగో, ఆ కనిపించే చిన్ని కొండను పడేయాలని ఎన్నాళ్ళనుంచో కిందా మీదా పడుతున్నాను. నా శక్తి అంతా ఉపయోగించినా, ఒక్క అంగుళం కూడా కదల్చలేక పోయాను" అంది.

ఎలుక కొండను పట్టుకుంది. "నాదొక పెద్ద శక్తి కాదు, తెల్లవారుతుందంటే భయం. ఊళ్ళో ఆంబోతు వచ్చి, తన కొమ్ములు నా రాళ్ళకు రుద్ది రుద్ది చంపుతుంది. దాని కొమ్ములు పదునవుతున్నాయి కానీ నా రాళ్ళు మాత్రం నుగ్గి నుగ్గి అయిపోతున్నాయి. నువ్వు ఆ ఆంబోతుని పట్టుకుంటే బాగుంటుంది" అన్నది కొండ.
తీరా ఆ ఆంబోతుని కదిలిస్తే "నాది మాత్రం ఏమి శక్తీ? నాలుగు తాళ్ళు తెచ్చి కట్టేస్తే, నేనలా పడి ఉండాల్సిందే, నా కంటే ఆ తాడుకే ఎక్కువ బలం" అంది.
"నాదేమి బలం, చిన్న ఎలక పిల్ల కూడా నన్ను పట పటా కోరికేయగలదు కదా" అంది తాడు.

తల్లి ఎలుకకు జ్ఞానోదయం అయింది, అందమైన ఎలుక వరుడిని చూసి, తన కూతురునిచ్చి పెళ్లి చేసింది.

ఈ లోకంలో ఎవరి బలం, శక్తియుక్తులు వాళ్ళవి. 'నాకు బలం లేదు' అనుకోవటమే బలహీనత. 'నా అంత బలం మరెవరికీ లేదు' అనుకోవటం మరీ గొప్ప బలహీనత .