flying birds photo: flying birds 8zmk5t.gif మంచులా,ముత్యంలా,మల్లెపువ్వులా స్వచ్ఛమైన మనసుండాలనేదే హేమంతం....

Monday, January 23, 2017

⌘ తెలుగు భాషా చమత్కారాలు ⌘

 తెలుగు భాషా చమత్కారాలు
మహాకవి శ్రీశ్రీ మద్రాసులో ఓ చిన్న హోటల్ కెళ్ళారు "టిఫినేముంది?" అనడిగాడు. "దోసై" అన్నాడు హోటల్ వాడు. "సరే వేసై" అన్నాడు శ్రీశ్రీ.

మరోసారి వైజాగ్ లో ఓ హోటల్ కి వెళ్లి టిఫినేముంది ఆని అడిగాడు. "అట్లు" తప్ప మరేం లేవు సర్ అన్నాడు వాడు. "సరే అట్లే కానీ" అన్నాడు శ్రీశ్రీ.

ఇంకోసారి ఓ మిత్రుడు ఊరెళ్తూంటే వీడ్కోలివ్వటానికి మద్రాస్ సెంట్రల్ స్టేషన్ కెళ్ళాడు. ప్లాట్ ఫాం పై ఓ పరిచయస్తుడు కనిపించి "ఊరికేనా?" అనడిగాడు. "లేదు ఊరికే" అని బదులిచ్చాడు శ్రీశ్రీ.

ఒక ఊరిలో ఒక చోట ఒక బోర్డ్ పై "ఇక్కడ వేడి తేనీరు దొరుకును" అని వ్రాసి ఉండటంతో "అరే ! ఇక్కడ వేడితే కాని నీరు దొరకదా?" అనడిగాడు.

ఓ ఇంటి ముందు "కుక్కలున్నవి జాగ్రత్త" అనే బోర్డ్ చూసి, ఆశ్చర్యం నటిస్తూ "అరే ఇంతకుముందిక్కడ మనుషులుండే వారే" అనన్నాడు.

ఓ కుర్రాడు ఒక పద్యం వల్లె వేస్తున్నాడు "ఎవడు రాత్రి లోకకంఠకుడు,"అని వల్లె వేయటం విని "ఒరే ! మొద్దబ్బాయ్ ! అలాకాదురా ! అది 'ఎవడురా త్రిలోక కంఠకుడు" అని సరి చేశాడు.

"జమాల్ భాషా - తోక - మాల్ భాషా ఇట్లనెను" అనేది తప్పు. జమాల్ భాషాతో కమాల్ భాషా ఇట్లనెను అనేది రైటు.

ఓ హరిదాసు విశ్వనాథ సత్య నారాయణ గార్ని కలిసి ఓ హరికథ ఏర్పాటు చేయటానికి సహకరించమని అడిగాడు. 
"మీ ఊరిలోనే చెప్ప కూడదటయ్యా" అన్నారు విశ్వనాధ వారు
"మా ఊరి వారు చెప్పిచ్చు కోరండి" అనన్నాడా హరిదాసు. 
"మా ఊరి వారు చెప్పుచ్చు కుంటారే" అన్నారు విశ్వనాధ వారు.



Tuesday, January 17, 2017

తెలుగు సంవత్సరములు

ప్రభవ , విభవ అనే 60 తెలుగు  సంవత్సరములు ఎలా  ఉద్భవించాయి ?
నారాయణ నామ స్మరణ చేస్తూ నారదుడు ఒకసారి ద్వారకా నగరానికి వచ్చాడు. అలా వచ్చిన మహర్షిని ఆహ్వానించి సకల మర్యాదలు చేసి కుశల ప్రశ్నలు అడిగాడు శ్రీ క్రిష్ణుడు.
అప్పుడు నారదుడు స్వామి తమరు లీలామానుష రూపం  కదా మీ మాయ ప్రభావంతో ఎందరో మాయలో పడిపోయారు మీ మాయకు లోబడనివారు ఎవరూ  లేరు కదా అన్నాడు.
శ్రీ కృష్ణుడు నారదా  ! మాయ బలీయమైన శక్తి . త్రిమూర్తులం మేమే ఆ మాయను జయించలేము. ఇక ఇతరుల విషయము చెప్పనేల ? అన్నాడు నారదుడు అందరి సంగతి ఏమోకాని స్వామి ! ఆ మాయ జితేన్ద్రియుడను , త్రిలోక సంచారిని  , పరమ భాగవతోత్తముడు  అయిన నన్ను మాత్రం ఏం చేయలేదు అన్నాడు ధీమాగా.
శ్రీ కృష్ణుడు నవ్వి వూరుకన్నాడు. అల కాసేపు బయట తిరుగుతూ మాట్లాడుకుందాం రా ! అన్నాడు సరే పదండి అంటూ నారదుడు అనుసరించాడు . అలా  వారిద్దరూ కాలి నడకన ఎంత దూరం నడిచారో వారికే తెలియదు. నారదుడు స్వామి నాకు దాహం వేస్తోంది.  కాళ్ళు లాగుతున్నాయి ఒక్క అడుగు కూడా వేయలేను అంటూ అక్కడే కూలబడి పోయాడు.
అప్పుడు శ్రీ క్రిష్ణ పరమాత్మ... అదిగో నారద దగ్గరగా కొలను కనిపిస్తోంది అక్కడకు వెళ్లి నీరు తాగుదాం కొంచెం  ఓపిక తెచ్చుకో అంటూ చేయి అందించాడు . కొంత దూరం పోగానే కలువ పూలతో ఎగురుతున్న పక్షులతో కిల కిల రావాలతో అందమైన సరోవరం కనిపించింది. నారదుడికి ప్రాణం లేచి వచ్చింది ఆ కొలనులో దిగి కడుపు నిండా నీరు తాగి నారాయణ అంటూ నీటిలో మునిగాడు . పైకి లేవగానే అందమైన స్త్రీగా మారి పోయాడు శ్రీకృష్ణుడు  కనుమరుగై పోయాడు. అలా ఆ సరోవర ప్రాంతంలో తిరుగుతున్న ఆమెకు ఒకనాడు అందమైన యువకుడైన యోగి ధ్యాన ముద్రలో ఉండి కనిపించాడు . ఆయనకు పరి చర్యలు చేస్తూ వుండి పోయింది . యోగి ధ్యానం నుండి లేవగానే కనుల ముందు యువతి  కనిపించటం ఆమె తనకు పరి చర్యలు చేయటం యోగికి సంతోషాన్ని కలిగించాయి .ఆ అందం తన ముందు ఉండడం  అందగాడు , యువకుడైన , యోగి మన్మధ రూపం ఆమెను ఆకర్షించాయి అలా  వారిద్దరూ వివాహ బంధంతో కలసి కాపురం చేస్తున్నారు . కొంత కాలానికి ఆ యోగి వలన ఆమెకు 60 మంది సంతానం కలిగారు.

 ఒకరోజున యోగి సమాధిలో ఉండగా పిల్లలంతా  చెట్ల క్రింద ఆడుకుంటున్నారు . ఆమె పిల్లలకు భర్తకు ఆహారంగా పళ్ళు ఏరుక వద్దామని గంపతో అడవికి వెళ్ళింది . గంప నిండా మామిడి పళ్ళ ను తెచ్చి భర్తకు, బిడ్డలకు తలా  ఒకటి ఇచ్చింది . అది తినగానే అందరు గిల గిల తన్నుకొని ప్రాణాలు వదిలేశారు.
క్షణాల్లో హటాత్తుగా జరిగిన సంఘటన చూచి దఃఖిస్తూ తను ఆ  పండ్లనే తిని చని పోవాలని అనుకుంది . చెట్టు వద్దకు వెళ్ళింది .  పైన పండు కనిపిస్తోంది  కానీ చేతికి అందడం లేదు . ఎత్తుకోసం భర్త , పిల్లల శవాలను పేర్చి వాటి పైకి ఎక్కి పండు కోయాలని ప్రయత్నం చేస్తోంది.
అంతలో ఒక వృద్ద బ్రాహ్మణుడు ఆ చెట్టు వద్దకు చేరి ఆ వింత దృశ్యం చూచాడు . అమ్మాయి ఎవరు నీవు ? ఇదేమిటి శవాలను గుట్టగా పేర్చి నువ్వు చేస్తున్న పని ఏమిటి వింతగా ఉంది. ఎవరు అసలు నువ్వు అన్నాడు . అందుకు ఆమె అయ్యా ఈ చని పోయిన మనిషి నా భర్త , పిల్లలు . జరిగింది అంతా  చెప్పి ఈ చెట్టు పళ్ళు  అందక ఈ పని చేస్తున్నాను అంది .
అందుకు బ్రాహ్మణుడు అమ్మా  ! చని పోయిన వారికి  అంత్య క్రియలు చేయకుండా ఆహరం తినడం తప్పు కదా ? పైగా ఆత్మహత్య మహా దోషం కదా ? ముందు వీరికి అంత్య క్రియలు చేయాలి దిగి రా !నేను నీకు తోడుగా ఉంటాను ఆ తరువాత జరగవలసినది ఆలోచిద్దాం  . ముందు స్నానం చేయాలి అ సరోవరం వద్దకు రా ! అంటు ఆమెను ఆ కొలను వద్దకు తీసుకువచ్చి మూడు సార్లు స్నానం చేయి . కొలనులో దిగి చేయి పైకి ఎత్తిపట్టి నీటిలో మునుగు అన్నాడు .
అలా  బ్రాహ్మణుడు చెప్పినట్టుగానే చేయి పైకి ఎత్తి కొలనులో మునిగి పైకి లేవగానే ఆ స్త్రీఎప్పటిలా నారదుడిగా మారిపోయాడు . ఆ బ్రాహ్మణుడు శ్రీ కృష్ణుడు గా మారి పోయాడు . స్వామి ఇదంతా నీ మాఏ గదా ! నేను నీ మాయకు లోబడి పోయి స్త్రీ గా అయ్యాను .పిల్లలను కన్నాను ' అన్నాడు తలవంచి సిగ్గుతో చేతి గాజులు చూచుకుంటూ. కృష్ణుడు నారద మాయకు అందరం లో బడక తప్పదు ఎవరు తప్పించుకోలేరు . మరల నీటిలో మునుగు అన్నాడు . కృష్ణుని మాటలతో మరోసారి నీటిలో మునిగి లేచాడు . చేతి గాజులు పోయాయి . స్వామి స్త్రీగా ఉన్నప్పుడు నన్ను పెండ్లాడిన ఆయన ఎవరు ? ఆ బిడ్డలు ఎవరు ? అన్నాడు . శ్రీ కృష్ణుడు నారదా ! ఆయన కాల పురుషుడు , ఆ బిడ్డలు ప్రభవాది సంవత్సరాలు . కాల పురుషునికి నకిలీ స్త్రీకి పుట్టిన బిడ్డలే ప్రభవ విభవ అనే పేర్లతో సంవత్సరాలుగా పిలువబడుతు ఉంటారు అన్నాడు . కృష్ణుని కీర్తిస్తూ హరి నామ స్మరణతో గగన మార్గాన వెళ్లి పోయాడు నారదుడు . అలా లోకంలో కాలము - సంవత్సరాలు  మిగిలి పోయాయి.

Tuesday, January 3, 2017

విలువ

రాళ్ళు కొట్టుకుని జీవించే ఒక అతను ఒక రోజు తన పని చేసుకుంటూ ఉండగా..,
కను చూపులో ఒక రాయి ఎంతో ఆకర్షణీయంగా
కనిపించింది.అతను ఆ రాయినిఇంటికి తీసుకుని వెళ్లి
భార్యకు ఇచ్చాడు.
ఆమె దాన్ని గూట్లో పెట్టింది. కొన్ని రోజుల
తరువాత కుంకుడు కాయలు కొట్టడానికి
దాన్ని ఉపయోగించుకుంది!
ఒక రోజున వాళ్ళ పిల్లవాడు రాళ్ళ ఆట ఆడుకోటానికి ఆ
రాయిని తీసుకుని బయటకి వెళ్ళాడు.
కొద్ది సేపటికి
అటుగా మిఠాయిలు అమ్ముకునే అతను
వచ్చేటప్పటికి పిల్లలు అందరూ ఆ మిఠాయి బండి
చుట్టూ మూగారు. ఈ పిల్లాడు కూడా రాయి
చేతిలో పట్టుకుని
వెళ్ళాడు.
ఆ రాయి మిఠాయి వ్యాపారిని ఆకర్షించింది. అతను
బాబుతో ఆ రాయి నాకు ఇస్తావా .. నీకు ఒక లడ్డూ ఇస్తాను అన్నాడు. పిల్లాడు
సంతోషంతో ఆ రాయి అతనికి ఇచ్చేశాడు.
సాయంత్రం చెత్త వస్తువులు ఏరుకునే అతని
స్నేహితుడు చూసి ఆ రాయి గురించి అడిగితే
అతను ఎవరో పిల్లాడి చేతిలో ఉంటె బాగుంది కదా అని
ఒక లడ్డూ ఇచ్చి తీసుకున్నాను అని చెప్పాడు. ఆ
స్నేహితుడు ఆ రాయిని కోరగా అతనికి ఇచ్చేశాడు.
అతను ఆ రాయిని మిగతా చెత్త వస్తువులతో కలిపి
చెత్త వస్తువులు కొనే వ్యాపారి వద్దకి పోయి
వస్తువులని వివిధ రకాలుగా విభజించి అతనికి
అమ్మగా అతను ఈ రాయిని చూసి అది ఏమిటి భలే ఉంది! నాకు ఇచ్చేయ్
అని అడిగాడు. దానికి అతను కొంత డబ్బు
తీసుకుని ఆ రాయి వ్యాపారి కి ఇచ్చేశాడు.
బాగుంది
కదా అని వ్యాపారి దాన్ని బల్ల పైన పేపర్ వెయిట్ గా
వాడసాగాడు.
కొన్ని రోజులకి ఒక టోకు వ్యాపారి ఇతని దుకాణానికి
వచ్చి ఆ రాయిని చూసి, అతనికి మరి కొంత ఇచ్చి ఆ
రాయిని తీసుకున్నాడు. దాన్ని వజ్రాల వ్యాపారి వద్దకి
తీసుకుని వెళ్లి పరీక్ష చేయిస్తే అది కొన్ని కోట్లు
విలువ చేసే మేలిమి వజ్రం అని తేలింది.
నీతి :-
అదే రాయి ని ఒకళ్ళు కుంకుడు కాయలు
కొట్టుకో డానికి వాడుకున్నారు. ఒకళ్ళు రాళ్ళ
ఆటఆడుకోటానికి వాడుకున్నారు. ఒకళ్ళు ఒక లడ్డూ
కోసం దాన్ని ఇతరులకి ఇచ్చేశాడు.
ఒకళ్ళు దాన్ని
పేపర్ వెయిట్ గా వాడుకున్నారు. నిజంగా దాని
గురించి తెలిసిన వ్యక్తి దాని విలువ
రాబట్టుకున్నాడు.
అట్లాగే ఈ మానవ జన్మ ఎంతో విలువైనది. ఎంతో
అరుదుగా లభించేది. దాన్ని దేనికోసం వాడుకోవాలి
అన్నది వారి వారి బుద్ధి మీద ఆధార పడి ఉంటుంది! మానవ జీవిత పరమార్థం
తెలిసికొనినవారు ఈ జన్మను సరిగా వాడుకుంటూ
జీవన్ముక్తి పొంద గలుగుతారు.
లేని వారు ఈ జీవితాన్ని వృథా చేసుకొంటారు.
అసలు..,
మానవ జన్మ ఎత్తిన ఈ,
మనుషులందరూ వజ్రాలే!
తమలోని మంచి,మానవత్వం,ప్రేమ అనే ధగ ధగలను దాచుకుని రాళ్ళలా జీవిస్తున్నారు!
వాటికి మెరుగు పెడితే దేశమంతా నిత్య దీపావళే కదా ...!


                                                                                           Facebook నుండి సేకరణ